స్టేషన్ ఘన్పూర్: గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలన ఎట్లున్నది..? అంతకుముందు 50 ఏండ్లు కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో ఆలోచించి ఓటే వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేషన్ ఘన్పూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. ప్రజలు ఆషామాషీగా కాకుండా బాగా ఆలోచించి ఓటేయాలని సూచించారు. ఎన్నికలొచ్చినప్పుడు అభ్యర్థుల, పార్టీల చరిత్రపై చర్చ జరిగితేనే రాయేదో, రత్నమేదో తేల్తదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం అన్నారు. తనకంటే గొప్ప ఉద్యమకారులు ఘన్పూర్లో ఉన్నరని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పుట్టగానే ఘన్పూర్లో గులాబీ జెండాలు ఎగిరాయని, బీఆర్ఎస్ పార్టీ 15 ఏండ్లు ఉద్యమం చేసి ప్రజల ఆశీర్వాదంతోని గత పదేళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉన్నదన్నారు.. మరి గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలన ఎట్లున్నది..? అంతకుముందు 50 ఏండ్లు కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందని అన్నారు. జయశంకర్ సార్ లాంటి వాళ్లు వద్దువద్దని ఉద్యమిస్తున్నా కూడా ఫజల్ అలీ కమిటీ రిపోర్టుకు వ్యతిరేకంగా కాంగ్రెసోళ్లు తెలంగాణను ఆంధ్రాలో కలిపిండ్రని సీఎం కేసీఆర్ విమర్శించారు.