Friday, May 10, 2024

సికింద్రాబాద్ గడ్డ..బీఆర్ఎస్ అడ్డా..ఎగిరేది గులాబీ జెండానే.!

spot_img

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికిగానీ తెలంగాణకుగానీ ప్రత్యేకంగా తీసుకువచ్చిన అదనపు ప్రాజెక్టుగానీ, ఒక్క రూపాయి అదనపు నిధులు కానీ ఏం లేవని కేటీఆర్ విమర్శించారు. ఇదే అంబర్ పేట నియోజకవర్గంలో ప్రజల చేతిలో తిరస్కారానికి గురైన తర్వాత, అదృష్టవశాత్తు గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారన్నారు. గెలిచిన తర్వాత అటు అంబర్పేట్ నియోజకవర్గానికి గాని, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కానీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.

కిషన్ రెడ్డికి దమ్ముంటే గత ఐదు సంవత్సరాలలో తీసుకువచ్చిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి ఈ ఎన్నికల్లో ఓట్లు అడగాలని కేటీఆర్ సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో అనుకోకుండా గెలిచిన కిషన్ రెడ్డి, ఈసారి మాత్రం కచ్చితంగా ప్రజల చేతులు మరోసారి తిరస్కారానికి గురవుతారని, సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆయన ఓటమి ఖాయమని కేటీఆర్ అన్నారు.

10 సంవత్సరాలలో హైదరాబాద్ నగరానికి తమ పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని, తమ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గెలిచిన తర్వాత అధికారం కోసం ఢిల్లీకి పర్యటనలు చేసే నాయకులను కాకుండా, నిత్యం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్ లాంటి ప్రజా నాయకులు నియోజకవర్గానికి అవసరమని కేటీఆర్ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి గులాబీ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


భారత రాష్ట్ర సమితికి కంచుకోటగా మారిన రాజధానిలో ఈసారి కూడా గులాబీ జెండా ఎగురుతుందని కేటీఆర్ తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ గారికి మద్దతుగా అంబర్ పెట్ నియోజకవర్గంలో కేటీఆర్ పాదయాత్రను నిర్వహించారు.

అంబర్పేటలోని పటేల్ నగర్ ప్రాంతంలోని ప్రేమ్ నగర్ చౌరస్తా నుండి ఆజాద్ నగర్ , పటేల్ వాడలలో ఇంటింటికి తిరిగి పద్మారావు గౌడ్ ను ఎం.పి గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలుకుతూ జై తెలంగాణ అంటూ నినాదాలతో మార్మోగించిన పటేల్ నగర్ ప్రాంత వాసులు, కేటీఆర్ తో ముచ్చటించారు. తన పాదయాత్రలో భాగంగా పలువురు ఇళ్లకు వెళ్లడంతోపాటు, మార్గమధ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కేటీఆర్ పలకరించుకుంటూ తన పాదయాత్రను ముందుకు నడిపించారు.

మిర్చి బండి , కిరాణా షాప్ వంటి వాటిలో ఉన్న వారితో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. కేటీఆర్ తో మాట్లాడిన వందల మంది ప్రజలు కూడా మళ్లీ తెలంగాణ పార్టీకి ఓటు వేసి బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ నే గెలిపించుకుంటామని ఓటర్లు కేటీఆర్ కు తెలిపారు. ఉద్యమకారుడు , అందరి మధ్యలో ఉంటూ, అందరికి సూపరిచితుడు అయిన పజ్జన్న ను గుర్తుపెట్టుకోవాలని ఓటర్లను కేటీఆర్ అభ్యర్థించారు.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ ఇజ్జత్ తీసిన గులాబీ బాస్..!

Latest News

More Articles