నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర హైవేపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. వీరిలో నవ దంపతులు ఉన్నారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
సికింద్రాబాద్లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత తిరిగివస్తుండగా నల్లగట్ల హైవేపై నెమ్మదిగా వెళుతున్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రవీందర్తో పాటు అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్కిరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
గత నెల 29న బాల కిరణ్కు కావ్యతో గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం జరిపించారు. ఈనెల 3న శామీర్పేటలో ఘనంగా రిసెప్షన్ పూర్తి చేశారు. 4న నూతన దంపతులను తీసుకుని వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇది కూడా చదవండి: బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుంది