Thursday, May 23, 2024

ఆటల్లో సిద్దిపేట అదుర్స్

spot_img

సిద్దిపేట ఫుట్‌బాల్‌ స్టేడియంలో ఇంటర్‌స్కూల్‌ డిస్ట్రిక్ట్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలను ప్రారంభించారు మాజీ మంత్రి హరీష్ రావు. చిన్న తనం నుంచే చదువుతోపాటు క్రీడా పోటీ తత్వం అలవరుచుకోవాలని సూచించారు. ఆటల్లో మంచి ప్రతిభ కనబరిస్తే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. అందుకే అన్ని జాతీయ స్థాయి క్రీడలకు సిద్దిపేట కేంద్రంగా మారిందన్నారు. తమ పాలనలో అన్ని ఆటలకు సంబంధించిన స్టేడియంలను సిద్దిపేటలో ఏర్పాటు చేశామని తెలిపారు.

చదువుకునే రోజుల్లో మాత్రమే ఆటలకు పరిమితమైన క్రీడాకారులను జాతీయ స్థాయిలో రాణించేలా సిద్దం చేస్తున్నామన్నారు. ఆటలు అదుర్స్ అనేలా సిద్దిపేటను తీర్చిదిద్దామన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 16 రకాల ఆటలకు సంబంధించిన గ్రౌండ్లు, కోర్టులు నిర్మించామన్నారు. వీటితో పాటు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో కూడా అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు అతిథ్యం ఇచ్చామని తెలిపారు. శారీరక వ్యాయామానికి స్విమ్మింగ్ ఫుల్ ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో వాలీబాల్ సెలెక్షన్స్, ఫుట్‌బాల్ సెలెక్షన్స్ ను నిర్వహించామన్నారు.

రంగనాయక సాగర్ వద్ద జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు సిద్దిపేట వేదికయిందని చెప్పారు. వీటన్నింటితో పాటు సిద్దిపేట స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అదనంగా మరో రూ.11 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామని వెల్లడించారు. కొత్తగా సరికొత్త హంగులతో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు రూ.4 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖో, హాకీ, కరాటే, రన్నింగ్‌, హ్యాండ్‌ బాల్‌, షాట్‌పుట్‌, స్కెటింగ్‌, అథ్లెటిక్స్‌ తోపాటు ఇటీవలే నూతన వాలీబాల్‌ అకాడమీ ఏర్పాటైందని తెలిపారు. ఆసక్తికలిగిన యువకులు, విద్యార్థులు క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు.

Latest News

More Articles