డిజిటల్ మోసాలను అరికట్టేందుకు అనుమానిత ఆర్థిక లావాదేవీలను జరుపుతున్న 70 లక్షల మొబైల్ నెంబర్లను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. ఆర్థిక సైబర్ భద్రత, పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంగళవారం ఓ సమావేశం జరిగింది. దీనికి జోషీనే అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రకమైన సమావేశాలు ఇకపైనా జరుగుతాయని, వచ్చే ఏడాది జనవరిలో తదుపరి సమావేశం ఉంటుందని చెప్పారు. ఇక డిజిటల్ మోసాల నివారణకు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలో మోసానికి సంబంధించి మాట్లాడుతూ రాష్ట్రాలను దీనిపై దృష్టి పెట్టాలని కోరినట్టు, వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉండేలా చూడాలన్నట్టు చెప్పారు.
Read Also: ఈ రోజు చాలా ప్రత్యేకం.. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు..
వ్యాపారుల కేవైసీ ప్రామాణికతకు సంబంధించీ చర్చ జరిగింది. కాగా, సైబర్ మోసాలపై సమాజంలో అవగాహన పెరగాల్సి ఉందన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా జోషి వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ప్రభుత్వ రంగానికి చెందిన యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)ల్లో ఇటీవలి కాలంలో డిజిటల్ మోసాలు జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐఎంపీఎస్ ద్వారా ఖాతాదారుల ఖాతాల్లోకి యూకో బ్యాంక్ నుంచి పొరబాటున రూ.820 కోట్లు బదిలీ అయ్యాయి. దీన్ని గుర్తించిన బ్యాంక్.. ఆ తర్వాత సదరు ఖాతాలను బ్లాక్ చేసి రూ.649 కోట్లు రాబట్టింది. ఇది ఎలా జరిగిందన్నదానిపై బ్యాంక్ వివరణ ఇవ్వాల్సి ఉన్నది.