2024లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం కనుమరుగవుతుందని, వాటిని రక్షించేవాళ్లు ఏకతాటిపైకి రావాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నాహాలు జరుగుతున్నాయని, అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయని రాఘవులు తెలిపారు.
2024లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మరణ శాసనంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, అందులో భాగంగానే ఈ నెల 23న బీహార్లో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి సీపీఎం పార్టీ హాజరవుతుందని, తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ కూడా రావాలని ఆయన కోరారు.