నల్లగొండ: నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో అనధికారిక క్రాప్ హాలిడే అమలు జరుగుతోంది. రైతులు మళ్లీ బోర్లు, బావుల తవ్వకానికి మొగ్గుచూపుతున్నారు. వానకాలంలో కురిసిన వర్షాలతో రైతులు సాగు మొదలుపెట్టారు. చివరి దశలో కేసీఆర్ సర్కార్ పంటలను కాపాడేందుకు నీరు విడుదల చేయడంతో రైతులు గట్టెక్కారు. కానీ, ప్రస్తుతం యాసంగి సీజన్లో సాగునీటి విడుదలకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు.
రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి అదనంగా కేవలం 12 అడుగుల మేర మాత్రమే నీరు అందుబాటులో ఉంది. అది వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలకే సరిపోయేలా లేదు. దీంతో ఈ సీజన్లో క్రాప్ హాలిడే అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించికపోయినా అనధికారికంగా అదే పరిస్థితి కొనసాగుతున్నది. దీంతో రైతులంతా ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించారు.
సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 522.80 (154.43టీఎంసీలు) అడుగుల మేర నీరు ఉన్నది. సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ 510 అడుగులు. డెడ్ స్టోరేజీ కంటే అదనంగా 12 అడుగుల నీరు మాత్రమే రిజర్వాయర్లో అందుబాటులో ఉంది. ప్రభుత్వం అనధికారికంగా పంటలకు నీరిచ్చే పరిస్థితి లేదని, రైతులు రబీలో క్రాప్ హాలిడేగా పాటించాలని ఇటీవల ఎన్నెస్పీ చీఫ్ ఇంజినీర్ అజయ్కుమార్ సూచించారు.
స్వరాష్ట్రంలో వ్యవసాయానికి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన తోడ్పాటుతో రైతులు పంటల సాగులో రికార్డులు సృష్టించారు. సమృద్ధిగా సాగునీరు, నిరంతర ఉచిత కరెంట్, రైతుబంధు, పంటల కొనుగోళ్లతో ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని పండించారు. దీంతో సాగర్ ఆయకట్టు పరిధిలో 2015 యాసంగి తర్వాత తొలిసారిగా రైతుల భూములు పడావు పడనున్నాయి. మరోవైపు సొంత సాగునీటి వసతి ఉన్న రైతులు సైతం వరికి బదులుగా మెట్ట పంటలు సాగుచేస్తేనే మేలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.