తెలుగు రాష్ట్రంలో,తెలంగాణ ప్రాంతంలో జన్మించి భారతదేశానికి ప్రధానమంత్రి అయిన గొప్ప నేత పీవీ నరసింహారావు అని అన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన ప్రధాన మంత్రిగా ఎన్నో ఆర్ధిక సంస్కరణలు చేసి భారత దేశాభివృద్ధికి కృషి చేశారన్నారు. నల్గొండ లోని క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి,దివంగత నేత పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆ తర్వాత మాట్లాడిన ఆయన.. ఆనాడు ఆయన గొప్ప సంస్కరణలు తీసుకురావడం కారణంగానే నేడు భారతదేశం అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు.
పీవీ నరసింహరావు గొప్ప బహుభాషా కోవిదుడని సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఆయన అనర్గళంగా 17 భాషల్లో మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేసేవారన్నారు. కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా గొప్ప రచయితగా కూడా పీవీ నరసింహారావు గుర్తింపు పొందరన్నారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన “వేయి పడగలు” అనే రచనను సహస్రఫన్ అనే పేరుతో పీవీ నరసింహారావు హిందీలోకి అనువాదం చేశారన్నారు. దేశానికి ఎంతో గొప్పగా సేవ చేసిన ఆయనను గొప్పగా గౌరవించుకునే అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహరావు ను గొప్పగా గౌరవించి ఆయన శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి, రాజధాని నగరం నడి బొడ్డున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. త్వరలోనే నల్గొండ పట్టణంలో కూడా పీవీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. పీవీ నరసింహ రావు ను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని సూచించారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.