న్యూజిలాండ్ గడ్డపై టెస్టు, వన్డే విజయంతో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ మరో సంచలనం నమోదు చేసింది. బుధవారం మొదలైన టీ20 సిరీస్లో కూడా బోణీ కొట్టింది. నేపియర్లో జరిగిన తొలి మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది. జిమ్మీ నీషం(48), కెప్టెన్ మిచెల్ శాంట్నర్(23) రాణించారు. స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్(14), చాప్మన్(19) నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో షొరిఫుల్ ఇస్లాం మూడు వికెట్లు తీయగా.. మెహిదీ హసన్, ముస్తాఫిజరు తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ లిట్టన్ దాస్(42 నాటౌట్) చివరిదాకా నిలబడగా.. యువ ఆల్రౌండర్ మెహిదీ హసన్(19 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. దాంతో టీ20 సిరీస్ లో బంగ్లా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.