యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఈ నెల 22న భువనగిరిలోని గురుకులాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ బృందం సందర్శించనుంది. అలాగే ఫుడ్పాయిజన్కు గురైన బాధిత విద్యార్థులతో పాటు.. ఈ ఘటనలో మరణించిన ప్రశాంత్ కుటుంబ సభ్యులను కలవనుంది. తర్వాత ఈ ఘటనపై కేంద్రానికి నివేదిక అందించనుంది.
భువనగిరి గురుకుల హాస్టల్లోని విద్యార్థులకు గత శుక్రవారం రాత్రి మజ్జిగతో పాటు కిచిడీ అందించారు. అయితే వాటిని తిన్న తర్వాత 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది.. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రశాంత్ అనే విద్యార్థి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. అక్కడే వెంటిలేటర్పై చికిత్స పొందిన ప్రశాంత్ మంగళవారం సాయంత్రం కన్నుమూశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: కిషన్ రెడ్డి కి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు