మహిళా హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే అని అన్నారు సీఎం కేసీఆర్. దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి (జనవరి 3) సందర్భంగా భారత జాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని, చారిత్రక కృషిని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
కుల, లింగ వివక్షలతో కూడిన విలువలు, మూఢ విశ్వాసాలతో కూనరిల్లుతున్న నాటి సమాజాన్ని, సమ సమాజం దిశగా నడిపించేందుకు సావిత్రీబాయి ఫూలే తన జీవితాన్ని ధారపోసారని అన్నారు సీఎం. ఈ క్రమంలో భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహం మహోన్నతమైనదని, నేటి తరానికి స్పూర్తిదాయకమన్నారు సీఎం కేసీఆర్.
బడుగు బలహీన వర్గాలు, మహిళల సమాన హక్కుల సాధన కోసం తాను ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఛీత్కరింపులు అవమానాలు ఎదురైనా, మొక్కవోని దీక్షతో ప్రతిఘటిస్తూ సావిత్రీబాయి ముందుకు సాగారని.. విధ్వేషాలకు వ్యతిరేకంగా తన ఆశయాల సాధన కోసం ధృఢ చిత్తంతో మహా సంకల్పంతో పోరాడారని కీర్తించారు కేసీఆర్. సంఘ సంస్కర్తగా, రచియిత్రిగా సామాజిక సంస్కరణలకై నడుం బిగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి గా దేశాభ్యున్నతికి సావిత్రీబాయి అందించిన స్పూర్తిని నేటితరం కొనసాగించాలని సీఎం పిలుపునిచ్చారు. భారత దేశ ప్రగతికి సామాజికాభ్యున్నతికి వారి ఆలోచనలు నేటికీ ఆచరణయోగ్యమైనవేనని సీఎం పిలుపునిచ్చారు. జీవితపు చివరి క్షణం వరకు పీడిత ప్రజల సేవకోసమే అంకితమైన సావిత్రిభాయి ఫూలే సేవాతత్పరత, యావత్ భరతజాతి కి స్మరణీయమని సీఎం తెలిపారు.
సావిత్రీబాయి ఫూలే స్పూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని, మహిళల సమాన హక్కుల కోసం కృషి చేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ దిశగా అనేక పథకాలను సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, మహిళా సాధికారతను సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం, దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.