కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగింది మూడు పిల్లర్లు మాత్రమే అని, వాటిని సరిచేసి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాలన్నారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వ్యవసాయాన్ని రాజకీయాలతో ముడిపెట్టి.. రైతుల పొలాలను ఎండబెట్టొద్దన్నారు. రైతాంగం ఉసురు పోసుకోవద్దు అని నిరంజన్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
మేడిగడ్డ బరాజ్ విషయంలో తప్పులు జరిగి ఉంటే ఉన్నతస్థాయి విచారణ జరిపి శిక్షలు పడేలా చూడాలన్నారు. కానీ రైతుల పొలాలను ఎండబెట్టకూడదన్నారు నిరంజన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక బ్యారేజ్ మాత్రమే. ఇది కాకుండా సుందిళ్ల, అన్నారం బరాజ్లు, పంప్ హౌస్లు, అండర్ గ్రౌండ్ టన్నెళ్లు, రిజర్వాయర్లు, ఓపెన్ కెనాళ్లతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సిస్టమ్ అభివృద్ది చేసి ఉందని తెలిపారు. వీటన్నింటినీ పక్కకు పెట్టి కుంగిన మూడు పిల్లర్లను చూపి ఇదే మొత్తం ప్రాజెక్ట్ అని దుర్భుద్దితో దుష్ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మేడిగడ్డను సరిచేయాలి. లేకుంటే గడపగడపకూ వెళ్లి రైతులను చైతన్యం చేస్తాం.. ఇంటికో వంద మందిని జమచేసి ఇంజనీర్ల సహకారంతో రైతులతోనే దీన్ని రిపేర్ చేయించుకుంటాం. రాజకీయాన్ని, వ్యవసాయాన్ని కాంగ్రెస్ కలిపి చూడొద్దు. ఏ ప్రభుత్వమైనా రైతుల కడగండ్లు తీర్చాలన్నారు. రైతుబంధు ఇవ్వకున్నా అప్పుచేసి సాగు చేశారు. ఇప్పుడు ఆ పంటలు ఎండిపోవడంతో రైతులు అవస్థపడుతున్నారు అని తెలిపారు నిరంజన్ రెడ్డి.
ఇది కూడా చదవండి: తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చేలా కాంగ్రెస్ యత్నిస్తోంది