తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేస్తుందని ఆందోళనకు దిగారు జాతీయ మాలమహానాడు సభ్యులు. తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా పోరాడిన అద్దంకి దయాకర్ లాంటి వారిని కాంగ్రెస్ పార్టీ తొక్కేస్తుందని ఫైర్ అయ్యారు. ఉద్యమకారుడు, దళిత నాయకుడైన అద్దంకి దయాకర్ కి కాంగ్రెస్ లో పదేపదే అవమానం జరుగుతుందని.. గొప్ప పదవి ఇస్తామన్న రేవంత్ రెడ్డి తన మాటని నిలబెట్టుకోవాలని.. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ.. జాతీయ మాలమహానాడు తెలంగాణ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఇవ్వకుండా అవమానించారు. ఆ తరువాత పార్టీలో మంత్రి పదవి దక్కలేదు. కనీసం ఎమ్మెల్సీ పదవి ఆశించినా అది కూడా రాలేదు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల్లో అద్దంకి బలవుతున్నాడని.. ఎవరు కుట్ర చేస్తున్నారో రేవంత్ రెడ్డి వెంటనే బయటపెట్టాలని పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. అద్దంకి దయాకర్ ని ఎదగకుండా అడ్డుకుంటున్న శక్తులను అంతమొందించడానికి తెలంగాణ పౌర సమాజం ఏకం అవ్వాలని.. అద్దంకికి న్యాయం జరగకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.