రానున్నది వేసవి కాలం. ఈనేపథ్యంలో నగరంలో చేపట్టిన విద్యుత్తు మరమ్మత్తులపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉపకేంద్రాల నిర్వహణ నుంచి లైన్ల మరమ్మత్తుల వరకు ఏదైనా రెండు గంటల కోత మించకూడదని టీఎస్ ఎస్పీడీఎల్ సీఎండీ ఆదేశించారు. అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. రెండు గంటలు కాదు మూడు నాలుగు గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో నగర వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో మొత్తం 2410 ఫీడర్లు ఉన్నాయి. రోజు సగటు వంద ఫీడర్లలో మరమ్మత్తులు జరుగుతున్నాయి. 15నిమిషాల నుంచి 2గంటల లోపే నిర్వహణ పనులు ముగించాలి. సీఎండీతోపాటు జిల్లా ఇన్ చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ గంటలు విద్యుత్ కోత విధిస్తున్నారు. హయత్ నగర్ బొమ్మలగుడితోపాటు పలు కాలనీల్లో గురువారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల దాకా కరెంటు నిలించింది. ఇదే ప్రాంతంలో వారం క్రితం కూడా చెట్ల కొమ్మల తొలగింపు పేరుతో కరెంటును నిలిపివేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కరెంటు ఉండదని రాజేంద్రనగర్ డివిజన్ వినియోగదారులకు మెసేజ్ లు వచ్చాయి. సనత్ నగర్ లో 5రోజుల క్రితం నాలుగు గంటలకు పైగా కరెంటు లేదని స్థానికులు మండిపడుతున్నారు.