గుజరాత్లోని జామ్నగర్ విమానాశ్రయం విమానాలతో నిండిపోయింది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహానికి హాజరయ్యే విమానాలతో జామ్నగర్ విమానాశ్రయం ట్రాఫిక్ జామ్ అయ్యింది. నాలుగు రోజుల్లో 400 చార్టర్ విమానాలు జామ్ నగర్ ఎయిర్ పోర్టుకు వచ్చాయి. మునుపెన్నడూ లేని రద్దీని దృష్టిలో ఉంచుకుని, విమానాశ్రయం సిబ్బంది సంఖ్యను పెంచింది. విదేశాల నుండి వచ్చే అతిథుల కోసం తాత్కాలిక కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, క్వారంటైన్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. గత 45 రోజుల్లో విమానాశ్రయం సుందరీకరణ, నిర్వహణ కూడా పూర్తయింది. బిల్ గేట్స్, సౌదీ అరామ్కో చైర్మన్ యాసర్ అల్ రుమాయన్, సింగర్ రిహన్న, బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింక్, ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ వంటి ప్రముఖులు చార్టర్డ్ విమానాల్లో జామ్ నగర్ కు వచ్చారు.
జామ్నగర్ ఎయిర్పోర్ట్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ బేస్ కావడంతో ఇక్కడ విమానాలను పార్క్ చేయడానికి స్థలం లేదు. రాజ్కోట్, పోర్బందర్, అహ్మదాబాద్ ముంబై సమీపంలోని విమానాశ్రయాలలో అతిథుల విమానాలను ఉంచారు. శనివారం 90 విమానాలు చేరుకోగా, ఆదివారం 70 విమానాలు విమానాశ్రయానికి చేరుకుంటాయి. అతిథుల కోసం ప్రత్యేక ఆహారంతో దుబాయ్ నుంచి జామ్నగర్కు రెండు స్పైస్ జెట్ విమానాలు వచ్చాయి. జామ్నగర్ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బందిని మోహరించారు. అంతేకాకుండా గుజరాత్ పోలీసు అధికారులు కూడా భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు.