దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దేశరాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలపై బాంబులు వేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ ఎయిర్పోర్టులపై బాంబు దాడి చేయబోతున్నట్లు బెదిరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బుధవారం రాత్రి 10:23 గంటల సమయంలో బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు స్థానిక పోలీసుల సాయంతో ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.