తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. లడ్డూ బరువు, సైజు ఏ మాత్రం తగ్గలేదని, రేటు తగ్గించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ అందిస్తున్నామని, బ్రహ్మోత్సవాలు , వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాల్లో తప్ప, మిగిలిన సమయంలో భక్తులు కావాలసినన్ని లడ్డూలు పొందవచ్చని సూచించారు. యువకులైన శ్రీవారి సేవకులు క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తిరుమలలో భక్తులు సేవలందించేందుకు ప్రస్తుతం ఉన్న 65 ఏండ్ల పరిమితిని 60 సంవత్సరాలకు కుదించాలని చేసిన సూచనను తిరస్కరిస్తూ 60 ఏళ్ల వారు సక్రమంగా సేవలందించగలరని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దర్శనం, సేవా టికెట్లు పొందిన భక్తులకు వసతి అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన సప్తగిరి విశ్రాంతి గృహాలను ఆధునీకరిస్తామని చెప్పారు ఈవో ధర్మారెడ్డి.
ఇది కూడా చదవండి:గోదాదేవిగా సినీ నటి శ్రీలీల అద్భుత నాట్య ప్రదర్శన