హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఉన్న చిన్నజీయర్ ఆశ్రమంలో సమత కుంభ్-2024 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ యువ నటి శ్రీలీల ప్రదర్శించిన నృత్యరూపకం హైలైట్ గా నిలిచింది. ఆ శ్రీరంగనాథుని కొంగున ముడేసుకున్న తిరుప్పావై ప్రవచనకర్త గోదాదేవిగా శ్రీలీల నాట్య ప్రదర్శన అందరినీ అలరించింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల్లో శ్రీలీలను మోడ్రన్ అమ్మాయిగా చూసిన వారికి ఈ ‘శాస్త్రీయ’ కోణం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తన డాన్స్ పెర్ఫార్మెన్స్ పై శ్రీలీల స్పందించింది. తాను చిన్నప్పుడే శాస్త్రీయనృత్యంలో శిక్షణ పొందానని తెలిపింది. గోదాదేవి ఒక మహిళా రత్నం అని, అలాంటి స్త్రీమూర్తి గాథ ఎంతో రమ్యంగా ఉంటుందని వివరించింది.
ఈ ప్రదర్శన ఇవ్వడానికి మంజుభార్గవి ఎంతో ప్రోత్సహించారని, ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పింది శ్రీలీల. దాదాపు 15 ఏండ్ల తర్వాత మళ్లీ స్టేజ్ పై నాట్యం చేశానని, ఈ ప్రదర్శన తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని చెప్పింది.
ఇది కూడా చదవండి: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్: అమ్మ ఫోన్ కాల్ నా ప్రాణాలను కాపాడింది