భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన సెక్టార్ టికెట్లను సోమవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. నవమి రోజు ఉభయ దాతల టికెట్ రుసుము రూ.7,500 కాగా దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు అదేవిధంగా రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 18న పట్టాభిషేక మహోత్సవం సెక్టార్ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ టికెట్లను కొనాలనుకునేవారు bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చిన అధికారులు చెప్పారు. కల్యాణం రోజున ప్రత్యక్షంగా రాలేని భక్తులు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలతో పూజ చేయించుకునే వెసులుబాటు కూడా కల్పించినట్లు చెప్పారు. ఇందుకు గాను రూ.5 వేలు, రూ.1116 టికెట్లనూ వెబ్సైట్లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇక సెక్టార్ టికెట్లు బుక్ చేసుకున్నవారు ఏప్రిల్ 1 నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు రామాలయ కార్యాలయంలో తమ ఒరిజినల్ ఐడీ కార్డులను చూపించి టికెట్లు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: లండన్ లో రోడ్డు ప్రమాదం..భారత విద్యార్థిని దుర్మరణం.!