రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేసి, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ నెల 15న ఒక రోజు ఆటో బంద్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ ప్రకటించారు. శనివారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లభించకపోవడంతో మనోధైర్యం కోల్పోయి ఆటోలను తగల బెట్టడంతోపాటు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
Read Also: ఐటీలో జాబ్స్ కోత.. ఒక్క జనవరిలోనే 30 వేల మందిపై వేటు
ఉచిత బస్సు ప్రయాణానికి బదులు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయంతోపాటు పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలని విజ్ఞప్తిచేశారు. 15న ఇందిరా పార్కు నుంచి అసెంబ్లీ వరకు జరిగే ర్యాలీకి అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ నాయకులు మహ్మద్ అజీముద్దీన్, మహ్మద్ దస్తగీర్, ఎస్కే మాము, అమర్ సుల్తాన్ పాల్గొన్నారు.