ఇంజినీరింగ్ పూర్తి చేసి కొలువుల్లో స్థిరపడాలనుకొనేవారికి ఐటీ కంపెనీలు బ్యాడ్న్యూస్ చెప్తున్నాయి. ఫ్రెషర్ల రిక్రూట్మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది ఎకనమిక్ టైమ్స్’ నివేదిక ప్రకారం ఈసారి నియామకాలు 20 ఏండ్ల కనిష్ఠానికి పడిపోనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల నుంచి ఐటీ కంపెనీలు కేవలం 70,000-80,000 మందిని మాత్రమే నియమించుకొనే అవకాశాలున్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఈ ఏడాది 15 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టా అందుకోనుండగా, ఇందులో 10 శాతం కంటే తక్కువ మందే క్యాంపస్ ప్లేస్మెంట్లు దక్కించుకొనే అవకాశం ఉన్నది. ఈ ప్రభావం టైర్-2 కాలేజీలపై భారీగా పడనున్నది. ముఖ్యంగా ప్లేస్మెంట్లపైనే ఆధారపడి నడిచే అనేక కాలేజీలు తీవ్రంగా నష్టపోనున్నాయి.
Read Also: ఖమ్మంలో గ్రూప్ వార్.. అడ్డుకోబోయిన పోలీసులపై కూడా దాడి
ఒకే నెలలో 30 వేల మందికి ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫేస్బుక్, అమెజాన్ మొదలుకొని చిన్నాచితక కంపెనీల దాకా అన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాదిలాగే ఈసారి కూడా ఈ తంతు కొనసాగుతున్నది. లేఆఫ్స్.ఎఫ్వైఐ వెబ్సైట్ ప్రకారం.. ఈ ఏడాది జనవరిలోనే అన్ని కంపెనీలు కలిపి 30 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ నెల 3వ వరకు 122 సాఫ్ట్వేర్ కంపెనీలు 31,751 మందిని ఇండ్లకు పంపాయి.