ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్పై కమిటీ చైర్మన్ మురళీధరన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఈ అమ్మకాల లొల్లేంటి? ఎవర్ని కదిపినా సీట్ల అమ్మకాలపైనే ఎక్కువ ఫిర్యాదులొస్తున్నాయి. సర్వేలో అనర్హుల పేర్లు ఎలా చేరాయి? పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ జాబితాలో పేర్లు ఎందుకు మారాయి?’ అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నల వర్షం కురిపిస్తూ అడ్డంగా బుక్ చేసింది అధిష్టానం. మురళీధరన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రేవంత్ తెల్లమొఖం వేసినట్టు తెలిసింది. చివరకు ‘టికెట్లతో నాకేం సంబంధం లేదు. మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి. మీరే అభ్యర్థులను ఎంపిక చేసుకోండి’ అంటూ రేవంత్ అసహనంతో సమావేశం నుంచి బయటకు వచ్చారని సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేవుతున్న టికెట్ల అమ్మకంపై తీవ్ర ఆరోపణలు వస్తుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ను నమ్మ డం లేదని తెలిసింది. దీంతో అభ్యర్థుల ఎంపి క బాధ్యతల నుంచి ఆయనను దూరం పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పూర్తిగా కేంద్ర స్క్రీనింగ్ కమిటీ తన ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిసింది. 13-14 తేదీల్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానున్నది. ఆలోపు రాష్ట్రం నుంచి పూర్తిస్థాయిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమాచారాన్ని తెప్పించుకోనున్నది. ఈ వ్యవహారంలో రాష్ట్ర నేతలను పూర్తిగా దూరం పెట్టనున్నట్టు సమాచారం.