రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాల్సిందిగా ఎక్స్ వేదికగా కోరారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. పంటలు చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందని తెలిపారు.
వరి, మకజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే, అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించి, అకడికక్కడే ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారని గుర్తుచేశారు. రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలని కోరారు. పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతోపాటు ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు హరీశ్ రావు.
ఇది కూడా చదవండి: తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం