దక్షిణాఫ్రికాలోని కలహరి టైగర్ రిజర్వ్ నుంచి తెప్పించిన ఆడ చిరుత గామిని ఇటీవలే ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే గామిని ఐదు పిల్లలకు కాదు, ఆరు పిల్లలకు జన్మనిచ్చినట్లు తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని కేంద్రం మంత్రి భూపేందర్ యాదవ్ ఇవాళ( సోమవారం) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఈ చిరుత ఆరు కూనలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ‘గామిని వారసత్వం ముందుకు దూసుకుపోతుంది..! ఈ ఆనందానికి అంతం లేదు. గామిని ఐదు పిల్లలకు కాదు.. ఆరు పిల్లలకు జన్మనిచ్చింది’ అంటూ కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
గామిని భారత్లో ప్రసవించిన నాలుగో విదేశీ చిరుతగా, తొలి దక్షిణాఫ్రికా చిరుతగా గుర్తింపు పొందింది. ఈ చిరుత ఆరు కూనలకు జన్మనివ్వడంతో.. భారత్లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 14కు పెరిగినట్లైంది. అదేవిధంగా గామిని కొత్తగా ఆరు కూనలకు జన్మనివ్వడంతో కునో నేషనల్ పార్కులో మొత్తం చిరుత పులుల సంఖ్య 27కు పెరిగింది.
ఇది కూడా చదవండి: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు మళ్లీ విచారణ