కరీంనగర్ జిల్లా: అమ్మమ్మ ఊరు నుంచి ఇంటికి వచ్చేందుకు బస్సు ఎక్కిన బాలిక అదృశ్యమైన ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి చెందిన కనుకుంట్ల నరసింహ పోలీస్ కానిస్టేబుల్ గా కరీంనగర్ లో నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. నరసింహ కూతురు వశిష్ట క్రిష్ణ (13) అనే బాలిక పాఠశాలకు రెండు రోజులు సెలవులు ఉండటంతో అమ్మమ్మ ఊరు పెద్దపల్లికి వెళ్ళింది.
సెలవులు ముగియడంతో బుధవారం 11 గంటల ప్రాంతంలో వశిష్ట తాతయ్య పెద్దపల్లిలో బస్సు ఎక్కించి కరీంనగర్ కు సాగనంపాడు. అమ్మాయి తండ్రికి బస్సు నెంబర్ మెసేజ్ చేయగా కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తా స్టేజి దగ్గర తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఇంతలోనే బస్సు వచ్చింది కానీ అమ్మాయి రాకపోవడంతో కండక్టర్ను అడగగా బైపాస్ రోడ్ లో దిగిందని చెప్పడంతో వెంటనే ద్విచక్ర వాహనంపై వెళ్లి చూడగా అమ్మాయి ఆచూకీ లభించలేదు. దీంతో చుట్టుపక్కల వారిని అడగగా ఏమీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.