మరో నాలుగు రోజుల్లో వినాయక చవితి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. గణేషుడి విగ్రహాలు ఒక్కొక్కటిగా మండపాలకు చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎన్ని విగ్రహాలు పెట్టినా.. ఖైరతాబాద్ గణేషుడి ప్రత్యేకత మాత్రం వేరేలా ఉంటుంది. ఈ విగ్రహ ఏర్పాటును పండుగకు మూడు నెలల ముందే ప్రారంభిస్తారు. ఎక్కడైతే విగ్రహం పెడతారో.. అక్కడే తయారు చేస్తారు. రాష్ట్రంలోనే అతి భారీ విగ్రహం కావడంతో.. ప్రతి ఒక్కరూ ఈ ఖైరతాబాద్ గణేషుడిని చూడటానికి ఇష్టపడతారు. విగ్రహ తయారీ మొదలు.. నిమజ్జనం వరకు వేలాది మంది దర్శించుకుంటారు.
Read Also: కాంగ్రెస్ అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తుందా?
కాగా.. నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రసిద్దిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఖైరతాబాద్కు వస్తుంటారు. వారిని దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు నిర్ణయించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో భక్తులకు టిక్కెట్ కొనుగోలు ఎలాంటి ఇబ్బంది రాకుండా అదనపు టికెట్ కౌంటర్లను ఓపెన్ చేస్తామని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి దొంగతనాలు జరగకుండా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పారు.