హైదరాబాద్: అమెరికాలో ప్రతిష్ఠాత్మక ‘ఫామ్ ప్రోగ్రెస్ షో – 2023’లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందింది. ఈ నెల 29 నుంచి 31 వరకు మూడు రోజులపాటు అమెరికాలోని ఇల్లినాయిస్ డెకాటూర్లో ఈ వ్యవసాయ ప్రగతి ప్రదర్శన జరగనుంది.
ఈ షోలో భాగంగా అధునాతన వ్యవసాయ ఉత్పత్తులు, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, రసాయనాలు, యంత్రాలు, పరికరాలు, విత్తన సాంకేతికతలపై చర్చలు జరుపుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇవ్వడంతో ఈ ప్రదర్శనకు హాజరవుతున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయిందన్నారు. అత్యధిక శాతం జనాభాకు ఉపాధి కల్పించే వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా మార్చాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. అమెరికాలో జరగనున్న ఈ వ్యవసాయ ప్రదర్శన దానికి తోడ్పడుతుందని భావిస్తుస్తున్నట్లు మంత్రి చెప్పారు.