తెలంగాణలో బీఆర్ఎస్ వైబ్రంట్ గా ఉందని..ఎఫ్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ మళ్లీ సర్కార్ ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఎలాంటి భేదం లేకుండా 10ఏండ్లు పాలించామని,అన్నిరకాల స్కీంలు అందించామని చెప్పారు. బీఆర్ఎస్ కు , కాంగ్రెస్ కు మధ్య ఓట్ల తేడా 1.8శాతం మాత్రమేనని..ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మి రెండు మూడు శాతం మంది అటు ఓటేశారని టీవీ9 ఇంటర్వ్యూలో కేసీఆర్ చెప్పారు.
ప్రశ్న: 10ఏండ్లు ఉద్యమం చేశారు. 10ఏండ్లు అధికారంలో ఉన్నారు. 20ఏండ్లు తెలంగాణతో మమేకం అయ్యారు. తెలంగాణకు సంబంధించిన ప్రతిదాంట్లోనూ మీ భాగస్వామ్యం కనిపిస్తుంది. అలాంటి బీఆర్ఎస్ ను ప్రజలు ఎందుకు ఓడించారు? కేసీఆర్ ఓడించారా? ఎమ్మెల్యేలను ఓడించారా?
జవాబు: మేము కులం, మతం, వర్గం అనే భేదం లేకుండా అన్ని రకాల ప్రజలను, అన్ని రకాల స్కీంలు అందించి ఆదుకున్నాం. కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఎవరికీ ఏ లోటు రానివ్వలేదు. అందరినీ ఆదుకున్నాం. రైతుబంధు ఇచ్చాం. పంటలు కొన్నాం. నీళ్లు వచ్చాయి. కరెంటు వచ్చింది. కడుపు నిండిపోయింది. దాని మీద కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చింది. రైతుబంధు మేము రూ.10 వేలు ఇస్తే వాళ్లు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. మేము పింఛన్ రూ.2 వేలు చెప్పితే వాళ్లు రూ.4వేలు చెప్పారు. మేము కల్యాణలక్ష్మి రూ.1లక్ష ఇస్తే వాళ్లు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. నిరుద్యోగులకు రూ.4వేల భృతి ఇస్తామన్నారు. వాళ్లు 420 హామీలు ఇచ్చారు. అయినా కూడా వాళ్లకు మాకు 1.8 శాతం ఓట్ల తేడా మాత్రమే వచ్చింది.
మిషన్ భగీరథ వచ్చింది, సాగునీళ్ల బాధ పోయింది, కరెంటు బాధ పోయింది, వాటి కంటే ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు కదా అని రెండు మూడు శాతం ప్రజలు అటు చేయి చాపారు. దాంతో మా అధికారం పోయింది. అంతకుమించి ఏం జరగలేదు. అందులో బ్రహ్మపథార్థం లేదు. ఎవరి తప్పూ లేదు. మేము అందరం బాగా పనిచేశాం. బ్రహ్మాండంగా పనిచేశాం. కేసీఆర్ తప్పులేదు, ఎమ్మెల్యేలది ఎవరిది కూడా తప్పు లేదు. కాంగ్రెస్ చేసిన అడ్డగోలు హామీల ప్రభావంతోనే జరిగింది. మేము 39 మంది గెలిచాం. అనేకమంది 1000-1200 మెజార్టీతో ఓడిపోయారు.
ఇట్ ఇజ్ నాట్ రౌట్ ఫర్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఇజ్ వైబ్రంట్ పార్టీ ఇన్ తెలంగాణ. నత్తింగ్ రాంగ్ హాజ్ గాన్ (బీఆర్ఎస్ పూర్తిగా కుప్పకూలలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ఇంకా క్రియాశీలకంగా ఉన్నది. ఏ తప్పూ జరగలేదు). తెలంగాణలో అసెంబ్లీకి మళ్లీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తది, అధికారంలోకి వస్తది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు. నేను ప్రామిస్ చేస్తున్నా.. నేను మళ్లీ ముఖ్యమంత్రి కాగానే మొదటి ఇంటర్యూ మీకే ఇస్తాను.
ఆరు నెలల్లోనే అంత చేంజ్ వచ్చిందా?
మల్కాజిగిరి సీఎం మీటింగ్కు 3-4వేలు మంది కూడా రాలేదు, భువనగిరిలో జనం రాలేదు, మహబూబాబాద్, ఆదిలాబాద్లో సీఎం సభ అట్టర్ఫ్లాప్ అయింది. మెదక్లో ఫ్లాప్ అయింది. జనం ఎందుకు వస్తలేరు? భయంకరమైన అనిశ్చితి. రైతు బీమా ఉంటదా ఊడుతదా తెలువదు. నీళ్లు ఇయ్యలే, కరెంటు ఇయ్యలే.. ఫెయిల్ అయ్యారు. కరెంటు ఇవ్వక మోటర్లు కాలబెట్టారు. వేలాది మోటర్లు, వందలాది ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. మాయమైన బోరుబండ్లు మళ్లీ వచ్చాయి. బాయిలో పూడికలు తీసే క్రేన్లు మళ్లీ వచ్చినయి. ఇదంతా కాంగ్రెస్ అసమర్థ పాలన కాదా?
ప్రశ్న: ప్రజాపాలన తీసుకవచ్చాం అంటున్నారు. ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలు వింటున్నాం, గత ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోలేదంటున్నారు. రోజు 1000 – 1500 మందిని కలుస్తున్నామని రేవంత్రెడ్డి అంటున్నారు.?
జవాబు: మా మంత్రులు ప్రజలను కలవలేదా. మా మంత్రులు ప్రజలో్ల లేరా? ఇదంతా బోగస్. బక్వాస్. వాళ్లు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు. అడ్డం పడిపోయారు. ఆరు ప్రధాన గ్యారెంటీలు, 420 హామీలు. ముఖ్యమంత్రి స్వయంగా, వందల సభల్లో.. కేసీఆర్ మొన్న లక్ష రూపాయల రుణ మాఫీ చేశారు కదా, వెంటనే బ్యాంకులకు పరుగెత్తండి, వెళ్లి రెండు లక్షల రుణం తీసుకొకోండి, డిసెంబర్ 9న 10.30 గంటలకు మేము మాఫీఫి చేసేస్తాం అని డేట్ చెప్పేశారు. డిసెంబర్ 9 పోయి ఎన్ని రోజులైంది. ఇంకెన్ని డేట్లు మారుస్తరు? భువనగిరికి పోయి యాదగిరి నర్సన్న మీద ఒట్టు, ఆదిలాబాద్కు పోయి బాసర సరస్వతి మీద ఒట్టు.. ఎందుకీ ఒట్లు పెట్టాలి? మీరు మొన్నటివరకు ప్రతిపక్షంలో ఉన్నరు కదా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు కదా, కాగ్ రిపోర్ట్ అసెంబ్లీ టేబుల్ మీద ఉన్నదా కదా, వాటిని చదివారు కదా? బడ్జెట్ స్పీచ్లో దంచారు కదా. భట్టి విక్రమార్క ఎంత పచ్చి అబద్దం చెప్తున్నారు.. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని అననే లేదని అంటున్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉంది. రుణ మాఫీ వంద రోజుల్లో చేస్తామని అనలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి డిసెంబర్ 9న రుణ మాఫీ చెప్పారు.. దానివి వీడియోలు ఉన్నాయి. నీవు చెప్పిన ప్రకారం ప్రజలు టెంప్ట్ అయి రుణం తీసుకున్నారు. హరీశ్రావు సవాల్కు ముఖ్యమంత్రి నోరు ఎందుకు తెరుస్తలేడు. ముఖ్యమంత్రి నోరు ఎందుకు పడిపోయింది. ఆగస్టు 15 వరకు రుణ మాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని హరీశ్రావు అడిగారు. ముఖ్యమంత్రి రుణ మాఫీ చేయలేడు. రెండు లక్షల రుణ మాఫీ చేయాలంటే రూ.39 వేల కోట్లు చెల్లించాలి. చెల్లిస్తాడా ఈయన? గవర్నమెంట్లో బీరువాలో డబ్బులు ఉండవండి.
ఈ ముఖ్యమంత్రి సిల్లీ విషయం మాట్లాడాడు. లంకెబిందెలు ఉన్నాయనుకొని వచ్చాం అన్నాడు. లంకెబిందెల గురించి ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడుతాడా? లంకెబిందులు సమాజంలో ఎవరు వెతుకుతారు? గవర్నమెంట్లో ప్రతిరోజు డబ్బులు వస్తాయి..పోతాయి. గవర్నమెంట్ దగ్గర కట్టలకు కట్టలు డబ్బులు ఉండవు. రైతుబంధు పేరును రైతు భరోసా అని పెడుతాం, 15 వేలు ఇస్తాం అన్నారు. రైతు భరోసా పోయింది గంగల కలిసింది. మేము ఇచ్చిన రైతుబంధే ఇవ్వలేకపోయారు. వీళ్లు ఇచ్చిన గ్యారెంటీలు భయంకరంగా ఫెయిల్ అయ్యాయి. ప్రజలు వాళ్ల తీర్పును పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడతారు.
ప్రశ్న: కాంగ్రెస్ చెప్పిన మార్పు వైపు ప్రజలు ఆలోచించి ఓటు వేశారని ఎందుకు అనుకోకూడదు?
జవాబు: కొత్తక వింత పాతొక రోత అనే సామెత ఉన్నది. మేము కూడా రివ్యూ మీటింగ్ చేసి కనుక్కొన్నాం. అంత బాగనే ఉండే కదా ఏమైందని అడిగి తెలుసుకున్నాం. పదేండ్లు ఇటు వేసినం కదా సార్, ఒకసారి అటు వేద్దాం అనుకున్నారు. నిజంగానే భ్రమల్లో కొందరు, మెగా డీఎస్సీని నమ్మి కొందరు యువకులు, ఇలా రకరకాల కారణాలు కొన్ని ఉన్నాయి.
(నోట్ : ఈ కథనం నమస్తే తెలంగాణ భాగస్వామంతో)