హైదరాబాద్: తమపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, 39 స్థానాల్లో గెలవడమే ఇందుకు నిదర్శనమన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. జనగామ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్కు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారని, దానిని కాపాడుకోలేక నెల రోజులకే చేతులెత్తేశారని విమర్శించారు. కేసీఆర్ను ఎందుకు ఓడించామా? అని ప్రజలు బాధపడుతున్నారని కడియం అన్నారు. తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని మరోసారి స్పష్టం చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
రేవంత్ రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కావాలనే రాజకీయ లబ్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాత కేసుల వివరాలను ప్రజల ముందు పెట్టాలా? అని కడియం ప్రశ్నించారు. ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ప్రస్తుతానికి రెండు హామీలే అమలు చేశారని గుర్తుచేశారు. మిగతావి అమలు చేస్తారో లేదో తెలియదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని అన్నారు.