Sunday, April 28, 2024

జేబీఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్టీసీ ఎండీ

spot_img

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను సోమవారం ఆయన సందర్శించారు. జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ సౌకర్యం అమలవుతున్న తీరును వారిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జేబీఎస్-వెంకట్ రెడ్డి నగర్(రూట్ నంబర్ 18 వీ/జే) సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ ను అందజేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు.

మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్థారించుకునేందుకు తమ ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించి.. సంస్థకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, 24 గంటలు అందుబాటులో ఉండే సంస్థ కాల్ సెంటర్ నంబర్లైనా 040-69440000, 040-23450033  ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.

Latest News

More Articles