హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గత రెండు, మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఉదయం నుంచి మొదలుకుంటే రాత్రి వరకు పలు చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు సడెన్ గా నిలిచిపోతున్నాయి. ప్రధానంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాలు, లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, బంజారాహిల్స్, సచివాలయం పరిసర ప్రాంతాలు, నెక్లెస్ రోడ్డు, ప్రజా భవన్, బేగంపేట్ ఏరియాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోతోంది.
ఇది కూడా చదవండి: రహదారిపై దగ్ధమైన కారు.. తృటిలో తప్పిన ప్రాణనష్టం!
సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లక్డీకాపూల్ మెట్రో స్టేషన్తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. అలాగే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తెలుగు తల్లి ఫ్లై ఓవర్, నెక్లెస్ రోడ్డు ఫ్లైఓవర్, ఖైరతాబాద్ జంక్షన్, తాజ్కృష్ణ, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 ఏరియాల్లో ట్రాఫిక్ కారణంగా కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.