దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్ కొత్త లాప్ట్యాప్ను భారత మార్కెట్లో విడుదల చేసింది.ఇప్పటికే గెలాక్సీ బుక్4 సిరీస్లో బుక్4 ప్రో, బుక్4 ప్రో 360లను తీసుకొచ్చిన సంస్థ.. తాజాగా గెలాక్సీ బుక్ 4 పేరుతో మరో కొత్త ల్యాపీని ఆవిష్కరించింది. ఫొటో రీమాస్టరింగ్, వీడియో ఎడిటింగ్ లాంటి ఏఐ టూల్స్ పాటు మరో వినూత్న ఫీచర్ను ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ బుక్4 కొత్త ల్యాప్టాప్ ఇంటెల్ కోర్ 5 ప్రాసెసర్+ 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.70,990గా కంపెనీ పేర్కొంది. అదే ప్రాసెసర్లో 16జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.75,990గా కంపెనీ నిర్ణయించింది. ఇక ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్+ 16జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.85,990గా శాంసంగ్ ప్రకటించింది. గ్రే, సిల్వర్ రంగుల్లో ఇవి లభిస్తాయి. ఇప్పటికే వీటి సేల్స్ ప్రారంభమయ్యాయని, కంపెనీ అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ స్టోర్లతో పాటు ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చని శాంసంగ్ తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.5 వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ అందించనుంది. 24 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పిస్తోంది.
ఈ కొత్త ల్యాప్టాప్ 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ యాంటీ గ్లేర్ స్క్రీన్తో వస్తోంది. 54Wh బ్యాటరీతో వస్తున్న ల్యాపీ 45W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ప్రీ ఇన్స్టాల్డ్ విండోస్11తో రానుంది. ఏఐ ఫొటో రీమాస్టర్ టూల్ని కలిగి ఉంటుంది. దీని సాయంతో పాత ఫొటోలను, తక్కువ క్వాలిటీతో ఉన్న ఫొటోలను అనవసర లైటింగ్ ఎఫెక్ట్స్ తీసేసి అందంగా మార్చుకోవచ్చు. స్టోరేజీని 1టీబీ వరకు పెంచుకొనే సదుపాయం ఉంది. ల్యాపీలోని ఇన్బిల్ట్ కెమెరా చాలకపోతే.. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ను వెబ్క్యామ్గా ఉపయోగించుకొనే సదుపాయాన్ని ఇందులో అందిస్తున్నారు. ఒక హెచ్డీఎంఐ పోర్ట్, రెండు యూఎస్బీ టైప్-సి పోర్టులు, రెండు యూఎస్బీ 3.2 పోర్ట్స్, మైక్రో కార్డ్ ఎస్డీ కార్డ్ రీడర్, ఆడియో జాక్, RJ 45 స్లాట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి:దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలి