మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఈటల రాజేందర్ గెలవబోతున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మల్లారెడ్డి తన రాజకీయం అనుభవంతోనే ఈటలపై ఆ కామెంట్స్ చేశారని తెలిపారు. పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియాల చిట్ చాట్ లో మాట్లాడారు.
ఈటల రాజేందర్ను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది మల్లారెడ్డి వ్యూహమని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో మల్లారెడ్డి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారని తెలిపారు. మల్కాజ్గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సే. అది ఈటల రాజేందర్కు కూడా తెలుసు. మల్లారెడ్డి అన్న మాట అంతరార్థం తెల్వక కొంతమంది ఆగమాగమవుతున్నారని కేటీఆర్ తెలిపారు.
కొంతమంది నాయకులు స్వార్థం కోసం పార్టీ నుంచి వెళ్లిపోయిన సరే… శ్రేణులు అంతా వెళ్లడం అసాధ్యమన్నారు కేటీఆర్. బీఆర్ఎస్లోనే తనకు గౌరవం ఉండేదని పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ చెప్పిన మాటను గుర్తుంచుకోవాలి. పార్టీ మారిన కేకే, రంజిత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. కష్టకాలంలో పార్టీతో ఉన్నవాడే నాయకుడు అవుతాడు. పారిపోయిన వాళ్లు లీడర్లు ఎలా అవుతారు? పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన నాయకులను ఓడించేందుకు ఎక్కువగా కష్టపడతాం. వారందరినీ కచ్చితంగా ఓడిస్తాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేస్తాం. పార్టీ శిక్షణ కార్యక్రమాలతో పాటు పార్టీ నిర్మాణంపైన దృష్టి పెడతామన్నారు కేటీఆర్.
ఇది కూడా చదవండి: స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదా? తాగితే ఏమవుతుంది?