ఏపీలోని రాయలసీమలో ఘోర ప్రమాదం జరిగింది. పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో వారి వాహనాన్ని(తుపాన్) వైయస్ఆర్ జిల్లా కొండాపురం వద్ద వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. తాడిపత్రి, జమ్మలమడుగు, కర్ణాటక బళ్లారికి చెందిన బంధువులంతా కలిసి ఈ నెల 13న తిరుమల వెళ్లారు. పలు ప్రాంతాలను సందర్శించి ఆదివారం రాత్రి 9 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. మరో అరగంటలో తాడిపత్రి చేరుకుంటారనగా.. సోమవారం తెల్లవారుజామున వైయస్ఆర్ జిల్లా చిత్రావతి వంతెన వద్ద ఎదురుగా వస్తున్న లారీ వీరి తుపాను వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వెంకటలక్ష్మి (55), ఆమె కుమారుడు, వార్డు వాలంటీరు సునీల్కుమార్రెడ్డి (26), డ్రైవర్ భూమిరెడ్డి సుధాకర్రెడ్డి (32), కర్ణాటక బళ్లారికి చెందిన కాటసాని సుభద్ర (35), ఆమె కుమారుడు కాటసాని నితిన్రెడ్డి (11), లక్ష్మీదేవి (38), వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన సుమలత (37) మృతిచెందారు. మృతులు వెంకటలక్ష్మి, సుమలత, లక్ష్మీదేవి, సుభద్ర నలుగురూ అక్కచెల్లెళ్లు. అనంతపురంలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.