Thursday, May 9, 2024

మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడు.. మద్దతు ప్రకటించిన దళిత నేతలు..!

spot_img

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి.  బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దార్శనికత, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల అన్ని వర్గాలు ఆకర్షితులవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర నలుమూలల నుంచి సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్న వివిధ పార్టీల వర్గాల నేతలు తమ రాష్ట్రంలో కూడా తెలంగాణ వంటి అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలోకి మహారాష్ట్ర దళిత రాజకీయ నేతలు, మేధావి వర్గం కూడా పార్టీలోకి చేరడానికి ముందుకు వస్తున్నారు.

ఈ సందర్భంగా బొంబాయి మహానగర మాజీ మేయర్ రమేశ్ జాదవ్, తెలంగాణ అభివృద్ధిని ఈ రాష్ట్రంలో చేపడుతున్న దళిత సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఇటువంటి అభివృద్ధి కావాలని, ఇక్కడ ఏర్పాటు చేసిన 125 అడుగుల డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు గొప్ప విషయమని, ఇది దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేస్తుందని రమేశ్ జాదవ్ తో పాటు సీఎం కేసీఆర్ ను కలిసిన బొంబాయికి చెందిన దళిత నేతలు స్పష్టం చేశారు.

ముంబయి మాజీ మేయర్ రమేశ్ జాదవ్ తో పాటు ముంబయి కార్పోరేటర్లు కళ్యాణ్ గైక్వాడ్, సందీప్ జాదవ్, దినేశ్ జాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తమ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. వారితో పాటు హల్దార్ జిల్లాకు చెందిన సర్పంచ్ సంఘటన్ అధ్యక్షుడు శ్యామ్ భవర్, మహారాష్ట్రకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ప్రతాప్ నలవాడే సీఎం కేసీఆర్ ను కలిసి తెలంగాణ అభివృద్ధి గురించి చర్చించారు.

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రగతి సంక్షేమంలో ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. మరికొద్దిరోజుల్లో తాము తిరిగి వస్తామని, తమ సహచరులు, అనుచరులతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి వచ్చి తమ మద్ధతును ప్రకటిస్తామని, కేసీఆర్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకుపోవడంలో తాము భాగస్వాములమవుతామని ముంబయికి చెందిన దళిత రాజకీయ నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర బీఆర్ఎస్ ప్రముఖ నేతలు మాణిక్ కదం, విజయ్ దేశముఖ్,  ఎమ్మెల్యే లు బాల్క సుమన్, జీవన్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

Latest News

More Articles