హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటింది. మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ దాని చుట్టపక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీలు వరకు నమోదు అవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి.
మరోవైపు పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మూగజీవాలు ఎండవేడిని తట్టుకోలేక అల్లాడుతున్నాయి. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు ఎక్కువగా తాగాలని, వీటి వల్ల శరీరం డీ హైడ్రేషన్కు గురికాకుండా ఉంటుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంచిర్యాల, నిజామాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నల్లగొండ జిల్లాల్లో 45 డిగ్రీలు దాటగా.. జగిత్యాల జిల్లాలో 45.5, కుమ్రంభీం జిల్లాలో 45.4, నిజామాబాద్ జిల్లాలో 45.1, నల్లగొండ జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.