రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణగ్రతలు నమోదు అయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరుకుంది. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం, మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండలాల్లో 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏప్రిల్ నెలకు సంబంధించి నల్లగొండ జిల్లాలో గత 10ఏండ్లలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. అలాగే నల్లొండ, ఆదిలాబాద్ జిల్లాలను మినహాయిస్తే..మిగిలిన జిల్లాల్లో 44.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామారావుపల్లిలో మట్కం గంగారం , కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పూదర కనకయ్య, జనగామ జిల్లాలో ఒకరు, జోగులాంబ జిల్లాలో ఒకరు, ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు వడదెబ్బతో మరణించారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన కావలి నీలకంఠం పిడుగుపాటుకు గురై మరణించారు.
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రానికి వడగాలుల ముప్పునకు సంబంధించిన ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈనెల 19,20 తేదీల్లో అన్ని జిల్లాలో 41-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించింది. 21న గద్వాల, మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్, నారాయణపే, వనపర్తి జిల్లాల్లో 22న ఈ జిల్లాలతోపాటు హైదరాబాద్, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, మేడ్చల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 40 డిగ్రీలలోపు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఎల్లో కలర్ సూచనలను జారీ చేసింది. 19,20,21వ తేదీల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: కాషాయ రంగులోకి మారిన డీడీ న్యూస్ చిహ్నం..!