రంగారెడ్డి : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ చెరువులో దూకడానికి యత్నించిన ఓ వివాహిత, ఆమె ఇద్దరు పిల్లలను రాజేంద్ర నగర్ ట్రాఫిక్ సీఐ శ్యాంసుందర్ రెడ్డి కాపాడారు.
భర్తతో గొడవ పడిన సదరు మహిళ తన ఇద్దరు పిల్లలతో హిమాయత్ సాగర్ చెరువు వద్దకు చేరుకున్నది. పిల్లలతో కలిసి చెరువులో దూకడానికి ప్రయత్నించిన మహిళను చూసిన ట్రాఫిక్ సీఐ, అతని సిబ్బంది పరుగెత్తి మహిళను, ఇద్దరు పిల్లలను వెనక్కి లాగేశారు.
అనంతరం వారికి నచ్చజెప్పి రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. వివాహిత బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కుర్మమ్మగా గుర్తించామని.. చిన్నారులు జశ్విత, జస్వంత్ అని పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ చేసి, ఇంటికి పంపించారు.