త్వరలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 16.14 కోట్ల మంది ఓటర్లున్నారని ఆయన తెలిపారు. మొత్తం 679 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఎన్నికల్లో 60 లక్షల మంది కొత్త ఓటర్లు తమ పేరు నమోదు చేసుకున్నారన్నారు. ఈసారి ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Read Also: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఛత్తీస్గడ్లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిచనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల కోసం ఐదు రాష్ట్రాల్లో కలిపి 1.77 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో 35,356, రాజస్థాన్ 51,756, మధ్యప్రదేశ్ 64,523, ఛత్తీస్ గడ్ 24,109, మిజోరాం 1276 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో ప్రతి 897 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రాల వారీగా ఎన్నికల తేదీలు
మిజోరాం నవంబర్ 7న ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఛత్తీస్ గడ్ లో నవంబర్ 7,17న రెండు విడతలలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
మధ్యప్రదేశ్ నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నారు.
రాజస్థాన్ నవంబర్ 23న ఎన్నికలు నిర్వహించనున్నారు.
తెలంగాణ నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు.
అన్ని రాష్ట్రాలలో డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
ఎలక్షన్ కోడ్ డిసెంబర్ 5న ముగియనున్నది.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్, ఫలితాలు..
- షెడ్యూల్ అక్టోబర్ 9న షెడ్యూల్ విడుదల
- నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల
- నవంబర్ 10 నామినేషన్లనకు చివరితేదీ
- నవంబర్ 13న నామినేషన్లు పరిశీలన
- నవంబర్ 15న నామినేషన్ల ఉపసంహరణ
- నవంబర్ 30న ఎన్నికలు
- డిసెంబర్ 3న ఫలితాలు
- డిసెంబర్ 5 ఎలక్షన్ ప్రాసెస్ ముగింపు
ఈ ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటించింది. తెలంగాణలో అక్టోబర్ 3 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించింది. తెలంగాణలో 119 స్థానాలు, మధ్యప్రదేశ్ 230 స్థానాలు, మిజోరాం 40 స్థానాలు, ఛత్తీస్ గడ్ 90 స్థానాలు, రాజస్థాన్ 200 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఛత్తీస్ గడ్ లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఒకే విడతలో ఎన్నికల కసరత్తు పూర్తిచేయనున్నారు.
కాగా.. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17న ముగియనుండగా.. తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో ముగియనున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్, మిజోరంలో ఎంఎన్ఎఫ్ వంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి.
Read Also: ఎలక్షన్ షెడ్యూల్ మీద కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్