దేశ వైద్యవిద్య చరిత్రలో తెలంగాణ వరుసగా రికార్డులు సృష్టిస్తున్నది. నిరుడు ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఈసారి ఏకంగా 9 కళాశాలల్లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. 15న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయంశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఏమూల ఎవరికి ఏ కష్టం వచ్చినా హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలే దిక్కయ్యేవి. వందల కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వచ్చేది. సకాలంలో వైద్య సదుపాయం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారింది. ఉద్యమ సమయంలో ఇవన్నీ కండ్లారా చూసిన కేసీఆర్.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టిసారించారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తూనే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.