Monday, May 6, 2024

సీఎం కేసీఆర్ కు మహారాష్ట్ర ప్రజల నీరాజనాలు

spot_img

హైదరాబాద్: మహోజ్వల భారత్ ఆవిష్కరణే లక్ష్యంగా బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ  కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనను చేపట్టారు. రెండు రోజుల పాట సాగనున్న ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (సోమవారం) మహారాష్ట్రలోని ధారాశివ్, సోలాపూర్ జిల్లాల్లో సీఎం పర్యటించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రోడ్డు మార్గంలో మహారాష్ట్ర పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కి హోంమంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో కూడిన దాదాపు  600 వాహనాలతో కూడిన కాన్వాయ్ బయలుదేరింది. దాదాపు 6 కిలోమీటర్ల మేర సీఎం గారి వెంట కాన్వాయ్ సాగింది. ఈ సందర్భంగా రహదారులు కొత్త శోభను సంతరించుకున్నాయి. ముంబాయి రహదారి మీదుగా ప్రయాణిస్తున్న సీఎం కాన్వాయ్ కి రహదారి పొడుగునా పూలు చల్లుతూ, గులాబీ కాగితాలు వెదజల్లుతూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్ నినాదాలతో టిఆర్ఎస్ శ్రేణులు,  సీఎం కేసీఆర్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. గౌరవనీయులైన చంద్రశేఖర్ రావు కి స్వాగతం, దేశ్  కి నేత కైసే హో – కేసీఆర్ జై సా హో ( దేశ నాయకుడు ఎలా ఉండాలి – కేసీఆర్ లా ఉండాలి) అంటూ మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు.

ధారాశివ్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ కి అక్కడి స్థానిక నాయకులు, మహిళలు సాంప్రదాయ రీతిలో హారతినిచ్చి, స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సోలాపూర్ కు బయలుదేరారు. ఆ సమయంలో జోరువాన కురుస్తున్నా లెక్కచేయకుండా సీఎం కాన్వాయ్ ముందుకు సాగింది.

సోలాపూర్ కు చేరుకున్న బిఆర్ఎస్ అధినేత  కేసీఆర్ కి స్థానిక నాయకులు, శ్రేణులు గొప్పగా స్వాగతం పలికాయి. కేసీఆర్ పై గులాబీ పూల వర్షం కురిపించాయి. కేసీఆర్ గారిని చూసేందుకు ప్రజలు గుమిగూడారు. మొబైల్ లతో ఫోటోలు తీసుకున్నారు. కేసీఆర్ తో చేయి కలిపేందుకు ప్రజలు, నాయకులు దూసుకొచ్చారు. సీఎం కేసీఆర్ ని స్వాగతిస్తూ డప్పు దరువులతో  ఆ ప్రాంతమంతా మారు మోగింది. స్థానిక నేతలు భారీ గజమాలతో కేసీఆర్ ని సత్కరించారు. ‘దేశ్ కి నేత కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ నినాదాలు మిన్నంటాయి. సోలాపూర్ ప్రజల అపూర్వ స్వాగతం మధ్య సీఎం కేసీఆర్ బాలాజీ సరోవర్ హోటల్ కు చేరుకొని కాసేపు సేదతీరారు.

అనంతరం  సీఎం కేసీఆర్ హోటల్ నుండి బిఆర్ఎస్ నాయకుడు ధర్మన్న ముండయ్య సాదుల్ ఆహ్వానం మేరకు,  సోలాపూర్ భావనారుషి పేట్ లోని వారి ఇంటికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ధర్మన్న సాదుల్ ఒక పర్యాయం మేయర్ గా, రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తరఫున సోలాపూర్ నియోజకవర్గ ఎంపీగా సేవలు అందించారు. ఈ సందర్భంగా ధర్మన్న సాదుల్ తన కుటుంబ సభ్యులను సీఎం కి పరిచయం చేశారు. కేసీఆర్ ధర్మన్న సాదుల్ తో సమకాలీన రాజకీయ పరిస్థితుల పై చర్చించారు.  అనంతరం సీఎం కేసీఆర్ రాత్రి బస నిమిత్తం బాలాజీ సరోవర్ హోటల్ కు తిరిగి చేరుకున్నారు.

ధర్మన్న సాదుల్ గృహానికి చేరుకున్న ముఖ్యమంత్రి కి అక్కడే స్థిరపడిన తెలంగాణ ప్రజలు దారి పొడవునా తెలుగులో మాట్లాడుకుంటూ స్వాగతం పలుకుతూ, ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం ఆకట్టుకున్నది. పద్మశాలీలు ఎక్కువగా స్థిరపడ్డ సోలాపూర్ లోని ఈ ప్రాంతంలోనే బిఆర్ఎస్ నాయకుడు ధర్మన్న సాదుల్ నివాసం కూడా ఉన్నది. ధర్మన్న సాదుల్ తెలంగాణకు చెందిన పేద పద్మశాలి కుటుంబంలో జన్మించారు. కరీంనగర్ జిల్లా కన్నాపూర్ గ్రామ వాస్తవ్యులైన వీరి పూర్వీకులు ఉపాధి కోసం సోలాపూర్ కు వచ్చి స్థిరపడ్డారు. ధర్మన్న సాదుల్ కాల క్రమంలో ప్రజా నాయకునిగా పలు పదవుల్లో రాణించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ ఆదర్శాలకు, విధానాలకు ఆకర్షితులై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలనను మహారాష్ట్ర ప్రజలకు కూడా అందించాలని లక్ష్యంతో వారు ఇటీవలే సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె.కేశవ రావు, ఎంపి నామా నాగేశ్వర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles