Sunday, May 5, 2024

కండక్టర్‌పై దాడికేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు.. పోలీసులను అభినందించిన సజ్జనార్

spot_img

కండక్టర్ విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా అతనిపై దాడిచేసిన కేసులో ఇద్దరు వ్యక్తులకు రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 500 చొప్పున జరిమానా విధిస్తూ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టు ఇన్‌చార్జి న్యాయాధికారి ఉదయ్‌నాయక్ నిన్న తీర్పునిచ్చారు.

బి.కృష్ణయ్య గద్వాల ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 15 మార్చి 2015న అలంపూర్ నుంచి కర్నూలుకు వెళ్తున్న బస్సులో విధుల్లో ఉన్నారు. అలంపూర్ దగ్గర తాగిన మత్తులో బస్సెక్కిన చాకలి శ్రీనివాస్, గోపి డోర్ దగ్గర నిల్చుని అసభ్యంగా ప్రవర్తించారు. బస్సెక్కే ప్రయాణికులను అసభ్యంగా తాకడం, ఉమ్మి వేయడం చేస్తుండడంతో గమనించిన కండక్టర్ కృష్ణయ్య మందలించారు. దీంతో వారు ఆయనపై దాడికి దిగారు. తిరుగు ప్రయాణంలో మళ్లీ వారు అదే బస్సు ఎక్కి కండక్టర్ విధులకు ఆటంకం కల్పించారు. కృష్ణయ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి:రాష్ట్రంలో కాంగ్రెస్‌ అడుగుపెట్టింది.. మళ్లీ కరువొచ్చింది

తాజాగా ఈ కేసులో తుదితీర్పు వెలువడింది. నిందితులిద్దరినీ దోషులుగా తేల్చిన కోర్టు చెరో రెండేళ్ల జైలుశిక్ష, చెరో రూ. 500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే సంస్థ సహించదని తెలిపారు. దాడులు, దౌర్జన్యాలకు దిగితే బాధ్యులపై ఇలా చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తూ ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేశారు సజ్జనార్.

Latest News

More Articles