Wednesday, May 1, 2024

ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలనతో.. వ్యవసాయం సహా అన్ని రంగాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శం

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం సహా అన్ని రంగాల్లో  దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని, రైతులు సహా సమస్త వృత్తులు, ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనిక పాలనతోనే ఇది సాధ్యమైందని జగద్గురు పంచాచార్య స్వామీజీలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా వీరశైవ పంచపీఠంలోని కాశీ, ఉజ్జయినీ, శ్రీశైల పీఠాల జగద్గురువులను సిఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా… చంద్రశేఖర శివాచార్య మహాస్వామి (కాశీ), సిద్దలింగ శివాచార్య మహాస్వామీజీ ( ఉజ్జయినీ) చెన్నసిద్ధ రమా పండితారాధ్య శివాచార్య మహాస్వామి(శ్రీశైలం) లు శనివారం ఉదయం  ప్రగతి భవన్ కు  చేరుకున్నారు. వారితో పాటు మహారాష్ట్ర, కర్నాటక, తెలాంణ రాష్ట్రాలనుంచి పలువురు శివాచార్య మహాస్వామీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో  సిఎం కేసీఆర్ శోభమ్మ దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగద్గురువులు పలు పుణ్య వచనాలు పలికారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ‘‘ పదేండ్ల అనతికాలంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సేవ గొప్పది. రైతుకు సాగునీటిని అందించడం గొప్ప విషయం. వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచి, రైతులను కాపాడుతున్న సిఎం కేసీఆర్ పాలన ఆదర్శవంతమైంది. ‘‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’’ అనే నినాదంతో రైతు సంక్షేమ రాజ్యం కోసం పాటుపడుతున్న సిఎం కేసీఆర్ సంకల్పం గొప్పది’’ అని జగద్గురువులు అన్నారు. భారత దేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసే దిశగా సిఎం కేసీఆర్ తలపెట్టిన నయా భారత్ నిర్మాణంలో తమ సహకారం ఆశీర్వాదాలు అన్ని సందర్భాల్లోనూ వుంటాయని వారు తెలిపారు.

సనాతన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ సాదు పుంగవులను ఆదరించడం గొప్ప విషయమని అందుకు సిఎం కేసీఆర్ అభినందనీయుడని ఈ సందర్భంగా జగద్గురువులు అభినందించారు. ‘‘ వేలాదిమంది సాదువులను ఏక కాలంలో ఆహ్వానించి వారిని గౌరవించడం ఆనాడు జనకమహారాజుకే సాధ్యమైంది. తిరిగి నేడు వర్తమాన భారత దేశంలో తెలంగాణలో సిఎం కేసీఆర్ కే సాధ్యమైంది. సాధు సంతులను ఆదరించే విషయంలో ‘కేసీఆర్ కలియుగ జనకుడు’..’’  అని వారు కొనియాడారు.

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…. రాష్ట్రం అవతరించి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో జరుగుతున్న దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రజలను ఆశీర్వదించడానికి జగద్గురువులు స్వయంగా రావడం తెలంగాణ ప్రజలందరి భాగ్యం అని అన్నారు. ‘‘ దేశంలో నీరు విద్యుత్తు వంటి సహజ వనరులు పుష్కలంగా లభ్యమౌతున్నాయి. అయినా 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో కేంద్రంలోని పాలకుల నిర్లక్ష్యం వల్ల దేశ వ్యవసాయ రంగం ఎంతో నష్టపోయింది. వ్యవసాయానికి సాగునీరు లేక విద్యుత్తు లేక రైతాంగం అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతు సంక్షేమ పాలన ఈ దేశానికి ఎంతో అవసరమున్నది. నయా భారత్ నిర్మాణం కోసం మీ సంపూర్ణ సహకారం ఆశీర్వాదం కావాలి’’ అని సిఎం తెలిపారు.

ఈ సందర్భంగా హాజరైన వేదపండితులు ఆచార్యులు సిఎం కేసీఆర్ దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించి, ఫల ప్రసాదాలను అందచేశారు. పంచాచార్య స్వామీజీలను  సాంప్రదాయపద్దతిలో సిఎం కేసీఆర్ సత్కరించారు.  ఈ కార్యక్రమంలో  ఎంపీ బీబీ పాటిల్ దంపతులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, మహారాష్ట్ర బిఆర్ఎస్ నేతలు శంకరన్న దోండ్గే, మాణిక్ కదమ్, హిమాన్షు తివారి తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles