Sunday, April 28, 2024

దానం ఓట‌మి ఖాయం.. సికింద్రాబాద్‌లో మ‌న‌కు పోటీ బీజేపీతోనే

spot_img

సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో దానం నాగేంద‌ర్ ఓట‌మి ఖాయం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్‌కు పోటీ బీజేపీతోనే అని అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ద్మారావు గౌడ్ భారీ మెజార్టీతో గెల‌వ‌డం ఖాయం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇవాళ(మంగళవారం) తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ పార్ల‌మెంట్ స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

ప‌ద్మారావు గౌడ్ హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌తి ఒక్క‌రికి సుప‌రిచితులు. ల‌ష్క‌ర్(సికింద్రాబాద్) అంటేనే గుర్తుకు వ‌చ్చేది.. కాబోయే ల‌ష్క‌ర్ ఎంపీ ప‌ద్మారావు. 2002, ఫిబ్ర‌వ‌రి 14 నాడు టీఆర్ఎస్ కార్పొరేట‌ర్‌గా ప‌ద్మారావు గెలిచారు. నాటి నుంచి నేటి వ‌ర‌కు ప‌ద్మారావు కేసీఆర్‌ను వెన్నంటి ఉన్నారు. ప‌ద్మారావును సికింద్రాబాద్ ఎంపీగా కేసీఆర్ ప్ర‌క‌టించ‌గానే నాకు 25 మేసేజ్‌లు వ‌చ్చాయి. ప‌ద్మారావును ప్ర‌క‌టించి బ్ర‌హ్మాండ‌మైన నిర్ణ‌యం తీసుకున్నార‌ని మేసేజ్‌లో తెలిపారు. ప‌ద్మారావు పేరు విన‌గానే సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు, ప్ర‌జ‌ల‌కు విశ్వాసం క‌లిగింది. 24 ఏండ్ల బీఆర్ఎస్ చ‌రిత్ర‌లో ఈసారి త‌ప్ప‌కుండా సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నుంచి ప‌ద్మారావు గెల‌వ‌బోతున్నారు. ఈ టెంపోను ప‌డిపోనివ్వ‌కుండా 53 రోజులు కాపాడాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంది. చెర‌వు నిండిన త‌ర్వాత క‌ప్ప‌లు మ‌స్తు వ‌స్తాయి. కానీ క‌ష్ట‌కాలంలో నిల‌బ‌డ్డ వ్య‌క్తే నిజ‌మైన నాయ‌కుడు అని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు.

బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు దానం నాగేంద‌ర్. ఒక‌టే మాట చెబుతున్నా.. రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు.. ఆత్మ‌హ‌త్య‌లు ఉంటాయి. త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటే ఖ‌త‌మై పోతారు. అధికారం కోసం ఆశ‌ప‌డి, గెలిపించిన ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు దానం. ఖైర‌తాబాద్ ప్ర‌జ‌లు బ్ర‌హ్మాండ‌మైన నిర్ణ‌యం తీసుకుని తీర్పు ఇస్తార‌నే విశ్వాసం ఉంది. దానం అవ‌కాశవాద రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఖైర‌తాబాద్ ప్ర‌జ‌లు తెలుసుకున్నారు. ఆనాడు ఆసిఫ్‌న‌గ‌ర్‌లో దానం నాగేంద‌ర్ టీడీపీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చారు. మ‌ళ్లీ ఉప ఎన్నిక‌లో ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే పున‌రావృతం కాబోతోంది. రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం మంచిది కాదు.. అక్క‌డ ఓ కాలు, ఇక్క‌డ ఓ కాలు వేస్తే ఎటు కాకుండా అయిత‌ది. దానంను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశాం. దానం నాగేంద‌ర్‌ను ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డంతో అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నాం. రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు స్పీక‌ర్ లోనైతే, వ‌దిలిపెట్ట‌కుండా సుప్రీంకోర్టుకు వెళ్తాం.. దానంను అన‌ర్హుడిగా చేసేదాకా పోరాడుతం. ఖైర‌తాబాద్‌లో మూడు, నాలుగు నెల‌ల్లో ఉప ఎన్నిక వ‌స్తుంది. దానికి త‌యారు కావాలి. ద్రోహం చేసిన నాయ‌కుల‌కు బుద్ది చెప్పాల‌ని మ‌న‌వి చేస్తున్నా. సికింద్రాబాద్‌లో పోటీ మ‌న‌కు కాంగ్రెస్‌తో లేదు. అది మూడో స్థానంలో ఉంది. దానంను ప్ర‌జ‌లు సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. మ‌న‌కు పోటీ బీజేపీతోనే అని కేటీఆర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: రేవంత్ హామీల వైఫల్యం పై చర్చకు వస్తావా జూపల్లి ..?

Latest News

More Articles