Sunday, April 28, 2024

రేపటి నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

spot_img

శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా రేపు( శుక్రవారం) నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయం ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు. 8న పాగాలంకరణ, కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలి రానున్నారు.

జ్యోతిర్ముడి కలిగిన శివ స్వాములకు మాత్రమే 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని ఈవో తెలిపారు. 5వ తేదీన సాయంత్రం 7:30 నుండి 11 గంటల వరకు వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతి శీఘ్రదర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కి ఏర్పాట్లు చేశామని తెలిపారు.

మార్చి 1వ తేదీ (శుక్రవారం)న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 2వ తేదీన భృంగీ వాహన సేవ, ప్రత్యేక సేవలు నిర్వహించనున్నారు. 3న హంస వాహన సేవ జరగనుండగా… విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 4వ తేదీన మయూర వాహన సేవకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 5వ తేదీన రావణ వాహన సేవకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనుంది. 6న పుష్పపల్లకీ సేవ, 7న గజవాహన సేవ నిర్వహించనున్నారు. 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ప్రభోత్సవం, నంది వాహన సేవ. లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 9న రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలు జరగనున్నాయి. 10న ధ్వజావరోహణం.. 11న అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఇది కూడా చదవండి: గురుకుల జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ల ఎంపిక జాబితా విడుద‌ల‌

Latest News

More Articles