- ప్రపంచ పర్యావరణ, జలవనరుల కాంగ్రెస్ -2023 సదస్సులో మంత్రి కేటీఆర్
హైదరాబాద్: కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ ఇప్పుడు సీఎం కేసీఆర్ దార్శనికతతో సుభిక్షంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గత తొమ్మిదేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అసాధారణమైన మైలురాళ్లను సాధించిందన్నారు.
సోమవారం అమెరికాలో జరిగిన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్-2023 సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మాణం, మిషన్ భగీరథతో ఇంటింటికీ ఉచిత తాగునీరు అందించడంతో పాటు దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయాన్ని కలిగిన రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఇక ధాన్యం ఉత్పత్తిలో భారత్ లో రెండో అతిపెద్ద రాష్ట్రంగా అవతరించిందని వివరించారు.
భారతదేశంలో ప్రజలకు ఉచితంగా తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా తెలిపారు. సీఎం కేసీఆరే స్వయంగా చీఫ్ ఆరిటెక్ట్, ఇంజనీర్గా మారి 90 మీటర్ల దిగువ నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి నీళ్లను ఎత్తిపోసిన ఘనత సీఎం కేసీఆర్ది అని కొనియాడారు. నీలి విప్లవంలో భాగంగా రాష్ట్రంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. ఇన్ల్యాండ్ ఫిషరీష్లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉందన్నారు.
కాళేశ్వరం నిర్మాణం ఓ అద్భుతం
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేవలం రూ.88 వేల కోట్ల ఖర్చుతో నాలుగేండ్ల వ్యవధిలోనే నిర్మించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసిన మట్టితో గాజాలోని 101 పిరమిడ్లను నింపవచ్చని, వినియోగించిన ఉక్కుతో 66 ఈఫిల్ టవర్లను, కాంక్రీట్తో 53 బుర్జ్ ఖలీఫాలను నిర్మించవచ్చని కేటీఆర్ వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 13 జిల్లాల్లో 500 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నదన్నారు. 240 టీఎంసీల వినియోగ లక్ష్యంతో 7 మెగా లింక్లు, 28 ప్యాకేజీలతో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. ఈ ప్రాజెక్ట్ కింద 20 కేంద్రాల్లో 22 పంప్హౌస్లు, 1,800 కిలోమీటర్ల మేర పొడవైన కాలువలు ఉన్నాయని తెలిపారు.
Minister @KTRBRS address World Environmental and Water Resources Congress in USA on Telangana's Success Story pic.twitter.com/kvKXWtOT7S
— Krishank (@Krishank_BRS) May 22, 2023