హైదరాబాద్: తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ తరువాత సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. డిసెంబరు ఆఖరి వారం నుంచి చలి తీవ్రత పెరగడంతో పాటు శీతల గాలులు వీస్తాయన్నారు.
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అత్యల్పంగా మెదక్ జిల్లాలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పగటి పూట ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు, అత్యల్పంగా 28 నుంచి 29 డిగ్రీల మధ్య హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.