Monday, May 6, 2024

పారిస్ ఒలింపిక్స్ కు కోటా సాధించిన వినేష్ ఫోగట్, అన్షు

spot_img

భారత మహిళా రెజ్లర్లు వినీష్ ఫోగట్, అన్షు ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ కోటాను సొంతం చేసుకున్నారు. ఆసియా క్వాలిఫైయర్ పోటీల్లో చూపిన అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్స్ కు దాదాపుగా బెర్త్ ఖాయం చేసుకున్నారు. 50 కేజీల విభాగంలో ఫోగట్.. కజకిస్థాన్ కు చెందిన లారా గనికిజీపై 10-0 తేడాతో ఘన విజయం సాధించగా అన్షు 11–0 తేడాతో ఉజ్బెకిస్తాన్ కు చెందిన లేలోఖోన్ సొబొరివాను చిత్తుచేసింది. అయితే ఈ విజయాలతో వారు ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించేందుకు మరింత చేరువయ్యారు. అయితే వారి స్థానం ఇంకా ఖరారు కాలేదు.

ఎందుకంటే.. వారు పొందిన కోటా దేశానికి సంబంధించినది తప్ప వ్యక్తిగతమైనది కాదు. వినీష్ ఫోగట్.. గనికిజీపై సాంకేతిక ఆధిపత్యంతో పైచేయి సాధించింది. తొలి రౌండ్ లో తొలుత రెండు పాయింట్లు సాధించిన ఫోగట్.. ఆ తర్వాత టేక్ డౌన్ ద్వారా రౌండ్ చివర్లో మరో రెండు పాయింట్లు సంపాదించింది. తొలి రౌండ్ ముగిశాక 4–0తో ముందంజలో ఉన్న ఫోగట్.. ఆ తర్వాత రెండుసార్లు తన ప్రత్యర్థిని బోల్తాకొట్టించడం ద్వారా 10–0 పాయింట్లతో  విజయం సాధించింది.

వినీష్ లాగానే అన్షు కూడా 57 కేజీల కోటాలో చోటు దక్కించుకుంది. మొదట మెరుగైన సాంకేతిక ఆటతీరుతో కిర్గిజ్ స్థాన్ కు చెందిన కల్మిరా బిలింబెకోవాపై నెగ్గి ఆ తర్వాత సెమీఫైనల్లో లేలోఖోన్ సొబొరివాను మట్టికరిపించింది. గతేడాది ఆగస్టులో మోకాలి గాయంతో అంతర్జాతీయ రెజ్లింగ్ కు దూరమైన వినీష్ ఫోగట్ కు సర్జరీ నుంచి కోలుకున్నాక ఇది తొలి పోరు. మరోవైపు చైనీస్ తైపీకి చెందిన చాంగ్ హుయ్ తిజ్ ను సెమీ ఫైనల్ లో ఓడించి రీతికా హూడా 76 కేజీల విభాగంలో ఒలింపిక్స్ కోటా సాధించింది.

ఇది కూడా చదవండి: మణిపూర్‌లో  రేపు 11 చోట్ల రీపోలింగ్‌

Latest News

More Articles