ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న రన్ మెషిన్ విరాట్ కోహ్లి మరో రికార్డ్ మీద కన్నేశాడు. మరో నాలుగు రోజుల్లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ -2023 ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న న్యూజిలాండ్-ఇంగ్లండ్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఇక భారత్ అక్టోబర్ 8న చెన్నై వేదికగా తమ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. కాగా.. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డు అందుకోనున్నాడు. నాలుగు వన్డే వరల్డ్కప్ టోర్నీలు ఆడిన ఐదో భారత ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. దాంతో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, ధోని వంటి భారత క్రికెట్ దిగ్గజాల సరసన కోహ్లి చేరనున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 2011, 2015, 2019 వన్డే ప్రపంచకప్లలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
Read Also: రేషన్ డీలర్ల కమీషన్ రూ.700 నుంచి రూ.1,400లకు పెంచుతూ ఉత్తర్వులు
ఇక ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి స్ధానంలో ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో ఏకంగా 6 వన్డే ప్రపంచకప్లలో భాగమయ్యాడు. సచిన్కు తోడుగా పాకిస్తాన్ దిగ్గజం జావేద్ మియాందాద్ ఈ రికార్డును కలిగి ఉన్నాడు. జావేద్ మియాందాద్ కూడా 6 వన్డే వరల్డ్కప్లలో భాగమయ్యాడు. వీరి తర్వాతి స్ధానంలో రికీ పాంటింగ్, మహేల జయవర్ధనే, జాక్వెస్ కలిస్ ఉన్నారు. వీరి ముగ్గురు ఐదు సార్లు వరల్డ్కప్లో పాల్గొన్నారు.