హైదరాబాద్ : అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పదేండ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన పలు చోట్ల మాట్లాడారు.
50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నర సంవత్సరాలలో జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి గా కేసీఆర్ బాధ్యతలు చేపడతారన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రారంభించిన దళిత బంధు దళితులందరికీ అందజేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1200 ఉన్న గ్యాస్ సిలిండర్ను రూ.400కే అందజేస్తామని చెప్పారు.